Wednesday, December 9, 2009

మబ్బు మెసేజ్

కాళి దాస విరచిత మేఘ సందేశం అపూర్వమైన ఒక మధుర కావ్యం. ఆ ఆవకాయని, క్షమించాలి, ఆ వాక్కాయని,, మళ్ళీ క్షమించాలి ఆ కావ్యాన్ని చదివే అవకాశం నాకు కాకతాళీయం గా కలిగింది. మా కూచిపూడి డాన్స్ గురువు గారైన డా|| యశోద గారు, ఉజ్జయిని కాస్మో పాలిటన్ సిటీ లో కాళిదాస అకాడమీ లో జరిగే కాళిదాస సమారోహం అనే ఒక ఆర్ట్ ఫెస్టివల్ కి ఈ కావ్యాన్ని (హమ్మయ్య పొల్లు పోలెదు) మా చేత నృత్య రూపకం గా చేయించారు. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శన చేయటం చాల అరుదు గా వచ్చే అవకాశం. ఆ ప్రదర్శన కి ముందు, ఆ రంగస్థలి మీద మరో NTR లా వెలిగి పోవాలని నేను పడ్డ తపన తడిసి మోపెడు అయ్యింది. ఎందుకంటే నా జీమాట్ పరీక్ష ప్రిపరేషను సన్నగిల్లి జూ|| NTR లా తయారయ్యింది. ఐనా సరే పట్టు వదలలేదు.
మా గురువు గారు యక్షిని పాత్ర వేసారు. నా చేత యక్షుడి పాత్ర వేయించారు. ఇంకో ఇద్దరు స్టూడెంట్లు మధ్యలో కధా విధానం కొనసాగించే వాళ్ళు గా వేసారు. ఆ కావ్యం లో శ్లోకాలు బట్టీ పట్టడం మొదలు పెట్టాను. దానికి ఒక కారణం ఉంది. ఈ శ్లోకాలకి సంగీతం కూర్పు చేసిన శ్రీ మురళి గారు వాటిని ఫాటకి ముందు సాకీలు ఉంటాయి చూసారు, అలాగ రూపొందించారు. తాళ బద్ధం గా ఉన్నా, గాయకుడు ఆ శ్లోకాలని బట్టీ పట్టాల్సి వచ్చింది. ఆ రూపకానికి మేము పెట్టుకున్న గాయకుడు ఆ శ్లోకాల బట్టీ పట్టలేక చీల్చి చండాడటం మొదలు పెట్టడు. అంటే శంకరాభరణం లో బ్రో ..చే ..వా ..రె.వ రురా ... ప ప ప పం ...టైప్ లో. ఆయన పాడే పార్ట్ కి డాన్స్ చెయ్యా ల్సింది నేనే కాబట్టి మా గురువు గారు ఒక పంచ దిన ప్రణాళికని వేసారు. ఆయనకి శ్లోకాలు బట్టీ వేయిస్తే రాగయుక్తం గా ఆయన పాడుకుంటాదని ముందు నాన్ను నేర్చుకోమని తర్వాత ఆ గాయకుడి కి నేర్చుకోవటం లో సహాయం చేయమన్నారు. ఏమి చెయ్యను? గురువు గారి ఆజ్ఞ, నా తక్షణ కర్తవ్యం. ఐనా అంబలి తాగే వాడికి మీసాలు ఒత్తే వాడు ఒకడు ఉండటమంటే ఇదే. ముందు నేను రాత్రనక పగలనక సాధన చేసి ఆ శ్లోకాలు నేర్చుకున్నాను. తర్వాత ఆ గాయకుడి ని పిలిచి ముందు ఒక చిన్న ఉపొద్ఘాతం చెప్పాను. "చూడండి' The relationship between a singer and dancer should be like fish and water but not like fish and fish curry'. ఎప్పుడో చిన్నప్పుడు పక్కింట్లో తిన్నాను తప్పులుంటే మన్నించు, అసలు నువ్వు fish curry యే తినక పోతే క్షమించు" అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోయాను. ఆన అంతలోనే కన్నీళ్ళ పర్యంతమై "అయ్యా శ్లోకాలు నేర్చుకొవాలి అంతే కదా" అన్నాడు. సరేలే పాయింట్ క్యాచ్ చేసాడని సంతోషించాను. కొంచెం అటూ ఇటు గా బానే పాడటం మొదలు పెట్టాడు.

ఆ శ్లోకాలల్లో వర్ణనలు అవి చాలా హృద్యం గా ఉంటాయి. చాలా మందికి ఆ మేఘ సందేశం కధ తేలిసే ఉంటుంది. కుబేరుడి శాపం వల్ల ఆయన కొలువులో ఉండే ఒక యక్షుడు తన భార్య అయిన ఒక యక్షిని కి దూరం ఔతాడు. ఆ సమయం లో సెల్ ఫోన్స్ లాంటివి లేవు కనక ఒక మేఘం తో కబురు పెట్టి క్షేమ సమాచారం తెలుసుకోవటం అవి చేస్తాడు. సెల్ ఫోన్స్ అవి లేని సమయం లోనే ఇంత టెక్నికల్ గా అడ్వాన్స్ చెందిన మనం ఈ రోజు యాపిల్, నోకియా, సోనీ అంటూ కుక్కల పేర్లు ఉన్న సెల్ ఫోన్స్ పొరుగు దేశాల నుంచి అడుక్కు తెచ్చుకునే ఖర్మ ఎంటో? అంటే మబ్బులతో వాటితో మేసేజ్ లు పంపిస్తే కమ్యునికేషన్ గ్యాప్ ఏమైనా వస్తుందేమో అన్న భయం ఉండి ఉండవచ్చు. మన వెర్రి కాని సెల్ ఫొన్స్ లో మాట్లడినా ఇలాంటి గ్యాప్స్ వస్తాయి. నిజం. మొన్న ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకడు వాడి కోర్స్ టీం మేట్ ఒక అమ్మయి కి ఫోన్ చేసి, "ఏంటి ఈ మధ్య ఫోన్ చేస్తుంటే కాల్ ఎత్తట్లేదు" అన్నాడు. దానికి ఆ అమ్మాయి "నువ్వు ఫొన్ చేస్తే నేను "కాలు" ఎత్తడమేంటి" అని కంఫ్యూజ్ అయ్యిందిట. ఇంతకీ మి చెప్తున్నా .... ఆ అదే మొత్తానికి అంతా ఆ ప్రదర్శన కి సిద్ధం అయ్యాం.

ఉజ్జయిని చేరుకున్నాకా మొదలైంది టెన్షన్. మా గంధర్వ గాయకుదు ఫైనల్ రిహార్సల్ లో హరిశ్చంద్రుడి నాటకం లో "ఇచ్చోటనే... లేత ఇల్లాలి...." లాంటి కాటికాపరి పద్యాల్లాగా పాడటం మొదలు పెట్టాడు. ఈ సారి మా గురువు గారు ఆయన్ని పిలిచి "Music is divine whether it is western or indian... " అని మొదలు పెట్టారు. ఆయన కంగారు పడి "అమ్మా!! ఎదో కొంచెం రాగం తప్పింది క్షమించండి, ప్రోగ్రాం లో బాగా పాడతానని" ఒట్టు పెట్టాడు. నాకు అనుమానమే, ఆయన స్టేజి మీద పొరపాటున ఆపినా నేను కంటిన్యూ చేయటం కోసం, నేను ఒక్క సీన్ కూడ మర్చిపోకుండా అన్నీ గుర్తు ఉండటం కోసం దేవుని కృప ఎంతైనా అవసరం అని ఆ రోజు త్రి కాల సంధ్యావందనం చేసాను. ఐనా నిజం చెప్పాలంటే, కాళికాదేవి కాళిదాసు గారికి నాలుక మీద బీజాక్షరాలు రాసినట్లు, చిన్నప్పుడు మా అమ్మ నాకు జ్ఞాపక శక్తి అమోఘం గా ఉండాలని సరస్వతీ పత్ర లేహ్యం, జ్ఞాన శూర మహా తాండవ పత్ర లేహ్యం, ఝండూ చ్యవన ప్రాస్, నా నాలుక మీద రాసి పన్లో పని అని ఆ పక్కనే ఉందని మా తాత గారు వాడే త్రిఫల చూర్ణం కూడా రాసింది. జ్ఞాపక శక్తి మాట ఎలా ఉన్నా ఆ త్రిఫల చూర్ణం దెబ్బకి ఒక మూడు రోజులు నేను బాత్రూము కి బెడ్ రూం కి మధ్య పెట్టిన మొత్తం పరుగులు ముందు టెండూల్కర్ రికార్డ్ బలాదూర్. ఆ తర్వాత బ్రహ్మ జ్ఞానం అబ్బింది అనుకోండి, అది వేరే విషయం.

ప్రదర్శన జరిగేటప్పుడు తీసే ఫొటోలు పాత్రికేయులు ఎలా తీస్తారో తెలీదు కాబట్టి, నాకు కొన్ని ప్రత్యేకంగా తీయమని మా మేకప్ మ్యాన్ కి కెమేరా ఇచ్చి కెమేరా మ్యాన్ చేసాను. అంతా సిద్ధం అయ్యాకా ప్రదర్శన మొదలు అయ్యింది. పేద్ద రంగస్థలం. ఉజ్జయిని అంటేనే కళలకు ఆలవాలం. అంచేత ఎందరో సంస్కృత పండితులు, సంగీత విద్వాంసులు, నాట్య కళ ని వెనక నుంచి ముందుకు చదివిన సమర్ధులు ఇలా అన్ని కళా రంగాల వారు వచ్చారు. ఒక మహా పండితుడు, తెలుగు వారే, ప్రదర్శన కి ముందు గ్రీన్ రూం కి వచ్చి, ఏమోయ్ యక్షుడి పాత్ర వేస్తు
న్నావంట కదా, నాకు పూర్వ మేఘం కంటే ఉత్తర మేఘం చాల ఇష్టం అయ్యా. చాలా బాగా చెయ్యాలి సుమా" అని ఒక చిరు నవ్వు నవ్వి వెళ్ళిపో యారు. (మేఘసందేశం, పూర్వ మేఘం ఉత్తర మేఘం అని రెండు భాగాలు గా ఉంటుంది). ఏదో పద్యాలన్ని బట్టీ పట్టాను కదా అని అప్పటి దాక మనల్ని మించినవాడు లేడు మనమే బాషా, ముత్తు, పెదడ్రాయరు ...సారి .. పెదరాయుడు అనుకున్న నేను సంస్కృతాంధ్రాలని అవపోసిన పట్టిన వాళ్ళముందు వాళ్ళకి నచ్చేలాగ చేయ్యటమంటే మైఖేల్ జాక్సన్ ముందు తీన్ మార్ వెయ్యటమే.

ప్రదర్శన ప్రారంభం అయ్యింది. నేను స్టేజి మీదకి వెళ్ళి నా భంగిమ లో నేను కూర్చున్నాను. ముందు ఒక 2 నిమిషాల వేణువు ఆలాపన తర్వాత "కశ్చిత్ కాంతా ...." అంటూ ప్రారంభం చెయ్యాల్సిన మా గాయకుడు, "చెక్ చెక్" అన్నాడు. నేను
ఆలాపన కే అభినయం మొదలు పెట్టడం తో మద్యలో ఒక యాంగిల్ లో ఫ్రీజ్ ఐపోయాను. అటు తిరిగి చూసాను. ఆ మైకులు అవి బిగించే వాడు ఆ మైక్ ని ఊది మావాడికి ఇస్తున్నాడు. ఇది మావాడి తప్పు కాదని తెలిసింది, లేకపోతే కురు వంశానికే కరువైపోయేవాడు. కాని మళ్ళీ వెంటనే మావాడు అందుకుని శ్లోకాలు మొదలు పెట్టాడు. మెల్లగా మెల్లగా రూపకం ఊపు అందుకుంది. రెండు భాగాలు పూర్తి అయ్యేసరికి ఒక గంటన్నర పట్టింది. నేను బ్యాక్ స్టేజి కి వచ్చేసరికి ఆ సంస్కృత పండితుడు వచ్చి "సెహభాష్.... చాల బాగా చేసావోయ్," అన్నారు. ఆ తర్వాత చాల మంది వచ్చి అభినందించారు.

మేకప్ వాడు వచ్చి వాడు తీసిన ఫొటొలు చూపించాడు. అందులో నేను లేను, నా ముఖం లేదు. నా పంచె, నా చెయ్యి, నా వీపు, వచ్చిన ప్రేక్షకులు, మైక్ సెట్స్ బిగించే వాళ్ళు, మేము ఆ ప్రదర్శన కి వేసుకు వచ్చిన వ్యాను, ఒక తింగర నవ్వు నవ్వుతూ వాడు, అక్కడకి వచ్చిన అమ్మాయిలు వీళ్ళందరూ ఉన్నారు. అంత మంచి ప్రోగ్రాం కి నాకు ఫొటొలు లేకపోవటం తో చాలా ఫీల్ అయ్యాను.

ఆ ప్రదర్శన కి ఇంత జరిగింది కాబట్టే ఇప్పటికీ మబ్బులని చూస్తే నాకు ఈ మేఘ సందేశం పద్య కావ్యమే మది లో మెలుగుతూ ఉంటుంది.